న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచీ (AQI) 331గా నమోదైంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, సఫర్ ప్రకారం దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచీ పేలవమైన కేటగిరిలో ఉన్నది. సోమవారం ఢిల్లీ నగరంలో 24 గంటల పాటు సూచీ 353 వద్ద కొనసాగింది. జాతీయ రాజధానిలో దీపావళి అనంతరం కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. పటాకులు, సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, వాహనాల నుంచి వెలువడే పొగకు శీతాకాలం పొగమంచు తోడు కావడంతో కాలుష్యం మరింత పెరిగింది.
గాలి నాణ్యత సూచీ (AQI) 0-50 మధ్యలో ఉంటే.. గాలి మంచిదిగా పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైనదిగా, 101-200 మధ్యలో ఉంటే ఒక మాదిరి పర్లేదు అన్నట్టుగా భావిస్తారు. ఇక 201-300 మధ్యలో ఉంటే అతి చెడుగాలిగా, 301-400 మధ్యలో ఉంటే అత్యంత చెడు గాలిగా,401 దాటితే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా.. గాలివేగం పెరుగుతున్నందున మంగళవారం సైతం గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం లేదని సఫర్ అంచనా వేసింది. ఉదయం పొగమంచు పేరుకుపోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో కేంద్రం ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి ఎయిర్ క్వాలిటీ కమిషన్ చైర్మన్ ఎంఎం కుట్టి అధ్యక్షత వహించనుండగా.. కేంద్ర పర్యావరణ కార్యదర్శి, సీపీసీబీ చైర్మన్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనున్నది.
సమావేశంలో వర్క్ఫ్రం హోం విధానంలో పని చేయాలని ప్రధాన ఎజెండాగా సమావేశం జరుగుతుందని, ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయనున్నట్లు చెప్పాయి. ఢిల్లీలో వాయు కాలుష్యంపై నమోదైన పిటిషన్ను విచారించిన సమయంలో సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్యానికి ప్రధాన దోషులు రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే కాకుండా కొన్ని ప్రాంతాలలో చెత్తను కాల్చడం ప్రధాన కారణాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
పంట వ్యర్థాలు వల్ల కేవలం 10 శాతం మాత్రమే కాలుష్యానికి కారణమవుతుందని అభిప్రాయపడింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నిర్మాణాన్ని నిలిపివేయడం, అనవసరమైన రవాణా, పవర్ ప్లాంట్లను ఆపేయడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయడం వంటి అంశాలపై మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది. సమావేశానికి హాజరు కావాలని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని చెప్పింది.