న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్పురిలో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కీలక నిందితుడ్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అల్లర్లలో తుపాకీతో కాల్పులు జరిపిన ఫరీద్ అలియాస్ నీతూను పశ్చిమ బెంగాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాకాండలో అతడు కీలక పాత్ర పోషించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్కు వెళ్లిన పలు పోలీస్ బృందాలు తమ్లుక్ గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉన్న ఫరీద్ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అనంతరం అతడ్ని విమానంలో ఢిల్లీకి తరలించినట్లు చెప్పాయి.
ఈ నెల 16న జహంగిర్పురిలో అల్లర్లు జరిగిన అనంతరం నిందితుడు ఫరీద్ పశ్చిమ బెంగాల్కు పారిపోయాడని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నాటి నుంచి పలు ప్రాంతాలు మారుతూ పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్నాడని ఆరోపించారు. దోపిడీ, చైన్ స్నాచింగ్, ఆయుధ చట్టాలకు సంబంధించిన ఆరు కేసులు ఇప్పటికే అతడిపై నమోదయ్యాయని తెలిపారు. 2010 నుంచి జహంగిర్పురి ప్రాంతంలో తరచుగా నేరాలకు పాల్పడుతున్నాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.