న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ప్రతిరోజూ దాదాపు కోటి మందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో అర్హులైన వారిలో 85 శాతం మందికి సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు.
‘మరో రోజు, మరో మైలురాయిని చేరుకున్నాం. నేటితో దేశంలో వ్యాక్సినేషన్కు అర్హులైన 85 శాతం మందికి సింగిల్ డోస్ టీకాలు వేయడం పూర్తయ్యింది. ప్రధాని మోదీ సబ్కా ప్రయాస్ అనే మంత్రంవల్లనే కరోనా వ్యతిరేక పోరాటంలో దేశంలో బలంగా దూసుకుపోతున్నది’ అని మన్సుక్ మాండవీయ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. సోమవారం నాటికి 128.66 కోట్ల వ్యాక్సిన్ కవరేజీ పూర్తయ్యింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 71 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.