న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి 1 వరకూ పటాకుల తయారీ, స్టోరేజ్పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిచడంతో గ్రీన్ క్రాకర్స్కు బ్యాన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ వ్యాపారులు కోరుతున్నారు. సెప్టెంబర్ 9న పటాకుల లైసెన్స్లకు దరఖాస్తు చేసుకునే సమయానికి పటాకులపై పూర్తిస్ధాయి నిషేధం విధించడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
దీపావళి, దసరా, చఠ్ పూజ, గురుపర్వ్, నవరాత్రి సన్నాహాల కోసం పటాకులను నిల్వ చేసిన వ్యాపారులు భారీగా నష్టపోనున్నారు. గత ఐదేండ్లుగా దీపావళి, దసరా ముందు వ్యాపారాలు కుంటుపడుతున్నాయని జామా మసీదు ప్రాంతానికి చెందిన పటాకుల వ్యాపారి అమిత్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్ కాలుస్తున్నా ఢిల్లీలో నిషేధించారని ఆయన వాపోయారు.
గత ఐదేండ్లుగా పటాకుల వ్యాపారంపై పండుగల ముందు పూర్తి నిషేధం విధిస్తుండటంతో తమ వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, రుణాలపై వ్యాపారం నడిపే దుకాణాదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని చాందినిచౌక్కు చెందిన పటాకుల వ్యాపారి మహేశ్వర్ దయాళ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధం నుంచి గ్రీన్ క్రాకర్స్కు మినహాయింపు ఇవ్వాలని కోరారు.