న్యూడిల్లీ: ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడు సాహిల్ను ఢిల్లీ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. భద్రతాకారణాల రీత్యా నిందితుడిని కోర్టుకు కాకుండా రోహిణి కోర్టు డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యోతి నాయిన్ ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు ప్రవేశపెట్టారు.
కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితుడు సాహిల్ హత్యకు వినియోగించిన ఆయుధాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని, నిందితుడు మాటిమాటికి మాట మారుస్తున్నాడని, కాబట్టి కేసులో స్పష్టత కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయమూర్తికి సమర్పించిన డాక్యుమెంట్లలో కోరినట్లు సమాచారం.
కాగా, నిందితుడు సాహిల్, హత్యకు గురైన బాలిక గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆదివారం బాలిక రిలేషన్ను ఆపేద్దామని చెప్పడంతో సాహిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత కూడా పక్కనున్న కంకర, సిమెంటుతో కూడిన గడ్డను తలపై మోదాడు.