First JN.1 Case: దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదైంది. ఇవాళ మొత్తం ముగ్గురి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 సోకినట్లు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్ రకం కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, ఢిల్లీలో JN.1 వేరియంట్ బయటపడటం ఇదే తొలిసారి అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
కాగా, దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వేగంగా వ్యాపిస్తున్నది. ఇవాళ కూడా 500 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,093 పెరిగింది.
అదేవిధంగా మంగళవారం ఒక్కరోజే దేశంలో మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,33,340 కి చేరింది. మొత్తం 4,44,72,756 మంది కొవిడ్ బారినపడి కోలుకున్నారు.
ఇదిలావుంటే దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 చాపకింద నీరులా పాకుతున్నది. గడిచిన 24 గంటల్లో 40 JN.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి వరకు మొత్తం JN.1 కేసుల సంఖ్య 109కి చేరింది. అందులో అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు రికార్డయ్యాయి.