న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులన్నీ ఢిల్లీ, కేరళలోనే నమోదయ్యాయి. మంగళవారం కూడా ఢిల్లీలో 35 ఏళ్ల విదేశీ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించలేదు. ప్రభుత్వ ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. తాజాగా నైజీరియా మహిళకు మంకీపాక్స్ నిర్ధారణ కావడంతో ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. అయితే మంకీపాక్స్ నిర్ధారణ, అనుమానిత రోగుల కోసం ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని మూడు ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు.
కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 9 కేసుల్లో గరిష్ఠంగా కేరళలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి కేరళకు తిరిగి వచ్చిన ఒక యువకుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. మరణాంతరం అతడికి మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.