న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు దీపావళి శాపంగా మారింది. దేశ రాజధానిలో వాయు నాణత్య అత్యంత దారుణంగా క్షీణించింది. అక్కడ గాలి విషపూరిత దశకు చేరుకున్నది. దీపావళి పటాకులు పేలడంతో.. గాలి నాణ్యత పడిపోయింది. నిన్న సాయంత్రం 4 గంటలకు 382 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర దశకు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. వాయు కాలుష్యం పెరగడంతో.. ప్రజల్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కొందరికి గొంతు నొప్పి రావడం.. మరికొందరికి కండ్ల మంట, కంటి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఢిల్లీతో పాటు సమీప పట్టణాల్లోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది. ఫరీదాబాద్(424), ఘజియాబాద్(442), గుర్గావ్(423), నోయిడా(431) పట్టణాల్లో కూడా వాయు నాణ్యత క్షీణించింది. గాలిలో పీఎం(పార్లిక్యులేట్ మ్యాటర్) పెరగడం వల్ల గుండె, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ఢిల్లీ ప్రభుత్వం బాణాసంచాపై నిషేధం విధించినా.. నగరంలో దీపావళి వేళ పటాకుల సందడి తగ్గలేదు.