న్యూఢిల్లీ, మే 6: విపక్ష పార్టీ నేతలను అరెస్టు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న బీజేపీపై ప్రతిచర్య మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బెదిరింపులకు పాల్పడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యను బీజేపీ అధికారంలోని హర్యానా పోలీసులు, కేంద్రం పరిధిలోని ఢిల్లీ పోలీసులు ఆక్షేపించారు. పోలీసులపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. మొత్తంగా ఒక వ్యక్తి అరెస్టు.. మూడు రాష్ర్టాల పోలీసుల మధ్య వార్కు తెరతీసింది.
అసలేం జరిగిందంటే..
కేజ్రీవాల్ ఇంటి ముందు గత నెలలో నిరసనలు చేపడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని, అలాగే ‘కశ్మీర్ఫైల్స్’ విషయంలో కేజ్రీవాల్ను బెదిరించాడని ఆరోపిస్తూ పంజాబ్లోని మొహాలీ పోలీస్స్టేషన్లో బగ్గాపై ఓ కేసు నమోదైంది. ఈ విషయమై విచారణకు హాజరు కావాలంటూ బగ్గాకు పంజాబ్ పోలీసులు పలుమార్లు నోటీసులు జారీచేశారు. దీనిపై స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో బగ్గాను అరెస్టు చేశారు. అయితే, 10-15 మంది పోలీసులు ఇంటికి వచ్చి తనపై దాడి చేశారని, తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లారని బగ్గా తండ్రి ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బగ్గా అరెస్టు గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
బగ్గాను కోర్టులో హాజరుపర్చేందుకు పంజాబ్ పోలీసులు మొహాలీకి తరలిస్తుండగా కురుక్షేత్ర వద్ద హర్యా నా పోలీసులు అడ్డుకొన్నారు. హర్యానా పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వచ్చిన ఢిల్లీ పోలీసులు బగ్గాను కస్టడీలోకి తీసుకొని ఢిల్లీ తీసుకెళ్లారు. బగ్గాను ఢిల్లీలో కాకుండా హర్యానాలోనే ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పంజా బ్ పిటిషన్ వేసింది. పంజాబ్ సర్కారు విజ్ఞప్తి ధర్మాసనం తోసిపుచ్చింది. బగ్గా అరెస్టు చట్టవిరుద్ధమని, రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ మండిపడింది. అయితే, పలుమార్లు నోటీసులు పంపినా బగ్గా స్పందించకపోవడంతో అతన్ని అరెస్టు చేశారని ఆప్ నేతలు తెలిపారు.