న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన కంగ్రాట్స్ తెలిపారు. రైతుల ఆందోళనలు ఫలించినట్లు ఆయన అన్నారు. కేంద్రం ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే, సుమారు 700 మంది రైతులను ప్రాణాలను దక్కించుకునేవాళ్లమన్నారు. భారతీయ చరిత్రలో తొలిసారి కేవలం ఆందోళన వల్ల ప్రభుత్వం మూడు చట్టాలను వెనక్కి తీసుకుంటోందని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
బహుజన్ సమాజ్వాదీ పార్టీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ.. రైతుల త్యాగం ఫలించిందన్నారు. 3 రైతు చట్టాల రద్దు నిర్ణయం ముందే తీసుకుంటే బాగుండేదన్నారు. అయితే పంటపై కనీస మద్దతు ధర డిమాండ్ ఇంకా పెండింగ్లో ఉందన్నారు. జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎంఎస్పీ కేంద్రం చట్టాన్ని రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశం, రైతు ప్రయోజనాల దృష్ట్యా మూడు సాగు చట్టాలను రద్దు చేశారన్నారు. రైతులకు అండగా బీజేడీ ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.
హర్యానా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గురు పూర్ణిమ రోజున కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతించారు. సమాజంలో శాంతి, సామరస్య స్థాపనకు ఇది బలమైన అడుగు అన్నారు. రైతు సంఘాలు తమ ఆందోళనల్ని విరమించుకోవాలని ఆయన కోరారు. రైతు సంక్షేమం కోసం తాము పనిచేస్తామన్నారు.
రైతుల ప్రయత్నాలు ఫలించినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. ప్రధాని మోదీ మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో నెగ్గేందుకు ప్రధాని, బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో యూపీలో బీజేపీ ఓడినా ఆశ్చర్యం లేదని గెహ్లాట్ అభిప్రాయపడ్డారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ఆహ్వానించారు.