Delhi Metro: నూతన సంవత్సరం తొలి రోజున ఢిల్లీ మెట్రోకు ప్రయాణికులు రికార్డు సంఖ్యలో పోటెత్తారు. ఢిల్లీ మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమైన నాటి నుంచి గత ఆరేండ్లలో ఎన్నడూ లేనంతగా ప్రయాణికులు ఈసారి మెట్రో సేవలను వినియోగించుకున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DRMC) వెల్లడించిన నివేదిక ప్రకారం.. 2024 జనవరి 1న ఒకేరోజు 67.47 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారు.
అంతకుముందు అంటే 2023 జనవరి 1న 49.16 లక్షల మంది ఢిల్లీ మెట్రో సేవలను వినియోగించుకున్నారు. అదేవిధంగా 2022 జనవరి 1న 23.66 లక్షల మంది, 2020 జనవరి 1న 55.26 లక్షల మంది, 2019 జనవరి 1న 50.16 లక్షల మంది ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అత్యంత తక్కువ రైడర్షిప్ 2021 జనవరి 1న నమోదైంది. కరోనా లాక్డౌన్ అనంతరం జరిగిన తొలి న్యూఇయర్ సెలబ్రేషన్ కావడంతో ఆ ఏడాది కేవలం 18.07 లక్షల మంది మాత్రమే ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రయాణించారు.
కాగా, ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఢిల్లీ మెట్రో స్టేషన్లలో భారీగా ప్రయాణికుల క్యూలైన్లు దర్శనమిచ్చాయి. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రెటేరియట్ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అదేవిధంగా 2023 ఆఖరి రోజైన డిసెంబర్ 31న కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య భారీగానే ఉన్నది. ఆ రోజు ఏకంగా 48.46 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారు.