Delhi MCD Polls: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కార్పోరేషన్లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ ఏకంగా 134 వార్డులను గెలుచుని ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పోరేషన్లో కొనసాగుతున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడింది.
వరుసగా గత మూడు పర్యాయాల నుంచి MCD ఎన్నికల్లో గెలుస్తూ 15 ఏండ్లుగా మేయర్ పీఠంపై తిష్టవేసిన బీజేపీ.. ఇప్పుడు 104 వార్డులతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 9 వార్డుల్లో గెలిచి పరువు పోగొట్టుకుంది. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో పేర్కొన్నట్లు 30 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు మరో మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఢిల్లీ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఆప్ను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తమ ప్రభుత్వమే ఉన్నా, ఢిల్లీ కార్పోరేషన్ బీజేపీ చేతిలో ఉండటంతో తమకు ఢిల్లీని క్లీన్ చేసే అవకాశం లేకుండా పోయిందని వారికి వివరించారు. ఎప్పుడైనా ఢిల్లీ పీఠంపై ఒక పార్టీ ఉంటే, ఢిల్లీ మేయర్ పీఠంపై మరో పార్టీ ఉంటూ వస్తున్నాయని, దాంతో సమన్వయం కొరవడి నగరంలో పారిశుద్ధ్యం పడకేస్తున్నదని ఆయన చెప్పారు. ఈసారి ఆ సంప్రదాయాన్ని తిరగరాయాలని, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్కే ఢిల్లీ మేయర్ పీఠాన్ని కూడా కట్టబెట్టాలని కోరారు. ఆయన కోరినట్టుగానే ఢిల్లీ ఓటర్లు ఇప్పుడు ఆప్కు అధికారం కట్టబెట్టడం గమనార్హం.