న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయడం లేదని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఫేస్బుక్ పేజీని (Facebook page) రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కొన్ని రోజులుగా నా ఫేస్బుక్ పేజీని తెరవలేకపోతున్నారు. అది హ్యాకింగ్కు గురైంది. వీలైనంత త్వరగా దానిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏదైనా అసాధారణ చర్య ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉండండి అంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఢిల్లీ మేయర్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ మేయర్గా ఓబెరాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 22న మేయర్ పీఠం కోసం జరిగిన పోలింగ్లో బీజేపీపై ఆమ్ ఆద్మీ ఘనవిజయం సాధించింది. బీజేపీకి 116 ఓట్లు రాగా, ఆప్కు 150 ఓట్లు పోలయ్యాయి. 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపాల్టీలో .. ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు గెలిచింది. బీజేపీ 113 సీట్లు కైవసం చేసుకున్నది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపాల్టీలో బీజేపీ పట్టుకోల్పోయింది.