Delhi Murder Case | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ 25 ఏండ్ల యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమెను సోమవారమే చంపాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. ఇక ప్రతి రోజు స్టెనోగ్రఫీ క్లాసులకు వెళ్తున్న ఆమెను ఢిల్లీ పార్కు వద్ద అడ్డుకుని, మాట్లాడుకుందామని చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆమె నో చెప్పింది. దీంతో తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్తో తలపై మోది చంపేశాడు.
మృతురాలు నర్గీస్ కమలా నెహ్రు కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అయితే నర్గీస్ను నిందితుడు ఇర్ఫాన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇర్ఫాన్ పెద్దగా చదువుకోలేదు. డెలివరీ ఏజెంట్గా పని చేస్తుండటంతో.. నర్గీస్ అతన్ని వ్యతిరేకించింది. ఇర్ఫాన్తో ఆమె మాట్లాడటం మానేసింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఇర్ఫాన్.. ఆమె ఓ ప్రణాళిక ప్రకారం చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.