న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: శరీర దారుఢ్యం పెంచుకునేందుకు ఓ వ్యక్తి నాణేలు, అయస్కాంతాలను మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వైద్యులు అతడి పెద్ద పేగుకు శస్త్రచికిత్స చేయగా.. అందులో 39 నాణేలు, 37 అయస్కాంతాలున్నాయి. ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించి రోగి ప్రాణాల్ని వైద్యులు కాపాడారు. అరుదైన ఈ ఆపరేషన్ను ఢిల్లీలోని సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు నిర్వహించారు.
కొద్ది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న ఓ 26 ఏండ్ల వ్యక్తి, చికిత్స కోసం దవాఖాన ఎమర్జెన్సీ వార్డ్లో ఇటీవల చేరారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న సదరు రోగి, గత కొంతకాలంగా నాణేలు, అయస్కాంతాలు మింగుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. రోగి పొత్తి కడుపునకు ఎక్స్-రే తీసి చూడగా.. నాణేలు, అయస్కాంతాలున్న సంగతి బయటపడింది.