న్యూఢిల్లీ: వైద్యపరంగా ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఒక వ్యక్తి సిద్ధమయ్యాడు. అయితే అతడ్ని ఆపేందుకు స్నేహితురాలు కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల వ్యక్తి మైయాల్జిక్ ఎన్సిఫలోమైలిటిస్ అనే దీర్ఘ కాల రోగంతో బాధపడుతున్నాడు. 2014లో ఈ వ్యాధి బారిన పడిన అతడు ప్రస్తుతం పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వైద్యపరంగా ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చికిత్స కోసమంటూ తప్పుడు కారణాలతో వీసాతోపాటు విదేశీ ప్రయాణ అనుమతులు పొందాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన 49 ఏళ్ల స్నేహితురాలు అతడ్ని ఆపేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మెడికల్ సూసైడ్ కోసం ఆ వ్యక్తి స్విట్జర్లాండ్ వెళ్లకుండా నిరోధించాలంటూ పిటిషన్ వేసింది. అతడికి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఒకటవ ప్రతివాది విదేశీ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరింది. అలాగే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటుకు రెండో ప్రతివాది అయిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించాలని కోర్టును అభ్యర్థించింది.
కాగా, తన స్నేహితుడికి దేశంలో లేదా విదేశాల్లో మెరుగైన చికిత్స అందించడానికి ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవని కోర్టుకు ఆ మహిళ తెలిపింది. అయినప్పటికీ వైద్యపరంగా చనిపోవాలన్న మొండి నిర్ణయం అతడు తీసుకున్నాడని ఆరోపించింది. దీనివల్ల ఆ వ్యక్తి వృద్ధ తల్లీదండ్రుల జీవితం దారుణంగా ప్రభావితమవుతుందని పేర్కొంది. అంతేగాక కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా ఆవేదన చెందుతున్నారని ఆమె తెలిపింది. కాగా, అతడి పరిస్థితి మెరుగవుతుందన్న ఆశతో స్నేహితురాలు ఈ పిటిషన్ను దాఖలు చేసిందని న్యాయవాది సుభాష్ చంద్రన్ వెల్లడించారు.