న్యూఢిల్లీ: ఓ వ్యక్తి కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఓ మద్యం దుకాణంలో మందు కొని కారులో కూర్చుని తాగాడు. ఓ అపరిచిత వ్యక్తి తాను కూడా కారులో కూర్చుని తాగుతానంటే సరే అన్నాడు. కాసేపటికే కారు ఓనర్కు మద్యం ఎక్కువైంది. దాంతో అపరిచిత వ్యక్తికి కారు కీస్ ఇచ్చి డ్రైవ్ చేయమన్నాడు. అతడు కొంతదూరం తీసుకెళ్లి ఆపగానే కారు తనదేనన్న సంగతి మర్చి దిగి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఆటోలో మెట్రో స్టేషన్కు వెళ్లి ఇంటికి చేరుకున్నాడు. తెల్లారి మత్తు దిగిన తర్వాత రాత్రి జరిగిందని గుర్తుకొచ్చి పోలీస్స్టేషన్కు పరుగుతీశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లిడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-2 ఏరియాకు చెందిన అమిత్ ప్రకాష్ అనే వ్యక్తి గోల్ఫ్ కోర్సు రోడ్డులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం కంపెనీలో విధులు ముగియగానే కారులో ఇంటికి వెళ్తూ ఓ బారులో మద్యం సేవించాడు. అది చాలదన్నట్లుగా బయటికి వస్తూ మరో మద్యం బాటిల్ కొన్నాడు. దాని ఖరీదు రూ.2,000 అయితే, ఫోన్ ద్వారా రూ.20,000 కొట్టాడు. బార్ కౌంటర్లో ఉన్న వ్యక్తి అది గమనించి రూ.18 వేలు క్యాష్ రూపంలో తిరిగిచ్చాడు.
ఆ తర్వాత అమిత్ ప్రకాష్ తన కారులో కూర్చుని మద్యం సేవించడం మొదలుపెట్టాడు. బార్లో తీసుకున్న రూ.18 వేలను, సెల్ఫోన్ను వెనుక సీట్లో పడేశాడు. అప్పటికే తన ల్యాప్టాప్ కూడా వెనుక సీట్లోనే ఉన్నది. అమిత్ ప్రకాష్ మద్యం సేవిస్తుండగా.. అప్పటికే ఇదంతా గమనిస్తున్న ఓ అపరిచిత వ్యక్తి కారు దగ్గరికి వచ్చి కారులో కాసేపు కూర్చోనిస్తే మద్యం తాగి వెళ్లిపోతానన్నాడు. అందుకు, మాంచి కిక్కులో ఉన్న అమిత్ ప్రకాశ్ సరేనన్నాడు.
అనంతరం అమిత్ ప్రకాష్.. తాను కారు నడిపేస్థితిలో లేనని, తనను ఇంటిదగ్గర దిగబెట్టమని ఆ అపరిచిత వ్యక్తికి కారు తాళాలు ఇచ్చాడు. అయితే ఆ అపరిచిత వ్యక్తి కారును గ్రేటర్ కైలాష్కు కాకుండా సుభాష్ చౌక్కు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో మాటల ద్వారా అమిత్ ప్రకాష్ కారు తనదేననే సంగతి మర్చిపోయాడని గ్రహించిన అపరిచితుడు.. సుభాష్ చౌక్లో కారు ఆపేశాడు. అక్కడ దిగి మెట్రో రైల్లో వెళ్లమని అమిత్ ప్రకాష్కు చెప్పాడు.
దాంతో అమిత్ ప్రకాష్ కారు దిగి అపరిచితుడికి థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత ఆటో మాట్లాడుకుని హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్కు వెళ్లాడు. అక్కడ మెట్రో రైల్ ఎక్కి గ్రేటర్ కైలాష్లోని ఇంటికి చేరుకున్నాడు. మరునాడు ఉదయం లేచి చూస్తే ఇంట్లో కారు లేదు. దాంతో కంగుతిన్న అమిత్ ప్రకాష్కు దిమ్మతిరిగింది. దెబ్బకు రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది. కారు, కారుతోపాటు ల్యాప్టాప్, సెల్ఫోన్, రూ.18 వేల నగదు పోయాయని గ్రహించి లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగుపెట్టాడు.
కాగా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమిత్ ప్రకాష్ను నిలువు దోపిడీ చేసిన ఆ అపరిచిత వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.