న్యూఢిల్లీ : మహిళలు కాలుమోపని రంగం లేని ఈ రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో పెద్దసంఖ్యలో మహిళా బస్ డ్రైవర్లు రానున్నారు. కనీస ఎత్తు సహా పలు నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం సడలించడంతో దేశ రాజధాని రోడ్లపై మహిళా బస్ డ్రైవర్లు దూసుకుపోనున్నారు. ఎక్కువమంది మహిళా బస్ డ్రైవర్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ ఉద్యోగానికి అవసరమైన కనీస ఎత్తును 159 సెంటీమీటర్ల నుంచి 153 సెంటీమీటర్లకు తగ్గించింది. మరోవైపు ఈ ఉద్యోగానికి అవసరమైన కనీస అనుభవాన్ని కూడా గణనీయంగా తగ్గించింది.
మహిళా బస్ డ్రైవర్లకు సబ్సిడీల కోసం రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపు చేపడతామని కూడా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోత్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం డీటీసీలో తెలంగాణకు చెందిన వీ. సరిత అనే ఒకేఒక మహిళ ఉన్నారు. బస్ డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే విషయంలో మహిళలకు కనీస ఎత్తు నిబంధన అవరోధంగా ఉంది. మూడేండ్ల పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే నిబంధన కూడా మహిళా డ్రైవర్లకు అడ్డంకిగా మారింది.
ఈ నిబంధనలను సడలిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నామని, మహిళా బస్ డ్రైవర్లను పెద్దసంఖ్యలో నియమించుకునేందుకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి గెహ్లోత్ పేర్కొన్నారు. బురారి సెంటర్లో మహిళల కోసం శిక్షణ వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో త్వరలోనే 1500 ఎలక్ట్రిక్ బస్సులను డీటీసీ ప్రవేశపెడుతోందని చెప్పారు. ఇంతటి భారీ సంఖ్యలో ఈ-వాహనాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తమదేనని తెలిపారు.