న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వానికి, ఎల్జీ కార్యాలయానికి మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏవైనా నియామకాలు చేపట్టేముందు ప్రభుత్వంతో ఎల్జీ చర్చించడం సంప్రదాయమని, కానీ ఎల్జీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎంపికచేసిన నామినేటెడ్ సభ్యుల విషయంలోగానీ, ఢిల్లీ హజ్ కమిటీ విషయంలోగానీ.. ఇలా పలు విషయాల్లో ఎల్జీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.
ఇదే విషయాలను ప్రస్తావిస్తూ పలుసార్లు ఎల్జీకి లేఖ కూడా రాశారు. ప్రభుత్వాన్ని విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దీంతో స్పందించిన ఎల్జీ ఓ సారి కూర్చొని మాట్లాడుకుందామని, అది ఏరోజన్నది మీరే నిర్ణయించాలంటూ కేజ్రీవాల్కు లేఖ పంపారు. వెంటనే స్పందించిన కేజ్రీవాల్ ఈ నెల 10న సమావేశమవుదామని మరో లేఖ రాశారు. దీంతో ప్లేట్ ఫిరాయించిన ఎల్జీ ఇప్పుడు తనకు సమయం లేదని, శుక్రవారం వరకు కలవడం కుదరదంటూ కేజ్రీవాల్కు లేఖ పంపారు. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారని, గత మూడు నెలల నుంచి గవర్నర్ను ఎందుకు కలవలేదని గవర్నర్ కార్యాలయ వర్గాలు అడిగాయి.