న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూటగట్టుకున్నది. ఈ జాబితాలో ముంబై, కోల్కతా కూడా చేరాయి.
స్విట్జర్లాండ్కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (IQA)ని తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్-10 జాబితాలో పాకిస్థాన్లోని లాహోర్, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నది.
కొనసాగుతున్న కాలుష్యం
శనివారం దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోయింది. ఏక్యూఐ 476గా నమోదైంది. వచ్చే 48 గంటల పాటు వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) శుక్రవారం హెచ్చరించింది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేడంతో పాటు వాహనాలను ‘బేసి-సరి’ విధానం అమలు చేయడంతో పాటు నిర్మాణాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే యూపీలోని బులంద్షహర్, హాపూర్, నోయిడా, మీరట్, ఘజియాబాద్లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. రాజస్థాన్లోని జైపూర్, ఉదయపూర్, అజ్మీర్, పుష్కర్ సహా 15 జిల్లాల్లో కాలుష్యం పెరిగింది.
వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు నష్టం
సీపీసీబీ ప్రకారం.. ఢిల్లీలో గాలిలో పీఎం2.5 స్థాయి శుక్రవారం అర్ధరాత్రి 300 మార్క్ను దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్ మీటర్కు 381 మైక్రోగ్రాములు. గాలి నాణ్యంగా ఉండాలంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది. పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపరితిత్తుల క్యాన్సర్తో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.