న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నది. దాంతో భారత విమానయాన సంస్థలన్నీ తమ సీట్ల సామర్థ్యాలను గణనీయంగా తగ్గించాయి. కరోనా మహమ్మారి కారణంగా భారత్ నుంచి విమానాల రాకపోకలపై పలు దేశాలు నిషేధించాయి. అదేవిధంగా దేశీయ విమానాల్లో కూడా ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.
భారత పౌర విమానయాన శాఖ నివేదిక ప్రకారం.. విమానాల్లో నెలవారీ సీట్ల సంఖ్యను భారత్ బాగా తగ్గించింది. దాంతో ఆరునెలల్లో మొదటిసారిగా రోజువారీ దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 100,000 కంటే దిగువకు పడిపోయింది. గత ఆదివారం దేశంలో విమాన ప్రయాణాలు చేసిన వారి సంఖ్య 87,372 మాత్రమే. గత ఆగస్టులో దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఇంత తక్కువగా ప్రయాణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
మే 17 నుంచి ఎయిరిండియా విమానాలు ప్రారంభం
దాంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎప్పుడు పునఃరుద్ధరించబడుతాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17న లండన్ నుంచి ముంబైకి విమాన సర్వీసులను పునఃరుద్ధరించనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే మే 18, 23, 30 తేదీల్లో తమ సర్వీసులు నడువబోవని ఎయిర్ ఇండియా ప్రకటించింది.