న్యూఢిల్లీ: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్(Telegram App)ను తాత్కాలికంగా కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు చెప్పింది. టెలిగ్రామ్ యాప్ కేసులో ఇవాళ జస్టిస్ తేజస్ కరియా తన తీర్పును వెలువరించారు. సెక్షన్ 69ఏ కింద ప్రభుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ను బ్యాన్ చేసిందని, ఆ యాప్ను బ్యాన్ చేయడానికి గల కారణాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రభుత్వం రక్షణాత్మక చర్యలు తీసుకున్నదని, కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అసమతుల్యంగా ఉన్నట్లు భావించలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది.
తాత్కాలిక బ్యాన్ కోసం ప్రభుత్వం సమర్పించిన కారణాలు సరిపోతాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ యాప్పై బ్యాన్ తప్పదని, ఐటీ చట్టంలోని 69ఏ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం యాప్ను బ్లాక్ చేసిందని కోర్టు పేర్కొన్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించేందుకు అన్ని కారణాలు ఉన్నాయని జస్టిస్ తేజస్ అన్నారు. కేంద్రం అనాలోచితంగా ఆదేశాలు ఇవ్వలేదని, ఐటీ చట్టం ప్రకారమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ప్రశ్నాపత్రాల పేపర్లను లీకేజ్ చేసి.. కొన్ని ముఠాలు చీటింగ్కు పాల్పడుతున్నాయని, కొందరు ఆ పేపర్లను టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా షేర్ చేసుకున్నట్లు కోర్టు చెప్పింది.
ఈ నేపథ్యంలో నీట్-రీఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకుని, టెలిగ్రామ్ యాప్ను జూన్ 22వ తేదీ వరకు కేంద్రం బ్లాక్ చేసింది. ఇక జూన్ 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను డిజైబుల్ చేసింది. దేశంలో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లు స్వేచ్ఛగా ఆపరేట్ చేస్తుండగా, కేవలం తమపై ఎందుకు బ్యాన్ విధించారని టెలిగ్రాం యాప్ కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లింది. జూన్ 21వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్ను నిర్వహించనున్నారు.