న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పటాకుల విక్రయాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇద్దరు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. పండుగ సీజన్లోనే గ్రీన్కాకర్స్ కొనుగోలు, నిల్వ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇద్దరు వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ యశ్వంత్ వర్మ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో పటాకులకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, దీనిపై విచారణ ఈ సమయంలో సరికాదని కోర్టు పేర్కొంది.
దీపావళి సందర్భంగా పటాకులు వినియోగించడంతో కాలుష్యం ఏర్పడుతుందని కోర్టు పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఢిల్లీ నగరంలో అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నిషేధాన్ని విధించింది. దీన్ని సవాల్ చేస్తూ గ్రీన్ కాకర్స్ వ్యాపారులు గత నెలలో హైకోర్టును ఆశ్రయించాయి. డీపీసీసీ నిర్ణయం ఏకపక్షమని, చట్టవిరుద్ధమని.. నిర్ణయంతో పలువురి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పిటిషనర్ ఆరోపించారు.