న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమిషనర్గా రాకేశ్ అస్తానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని ఇవాళ ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును ఇచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ కేసును విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచిన విషయం తెలిసిందే. పిటిషినర్ తరపున అడ్వకేట్ బీఎస్ బగ్గా, ఎన్జీవో తరపున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్లు వాదించారు. ఇక ప్రభుత్వం తరపున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అస్తానా తరపున ముఖుల్ రోహత్గీ వాదించారు.
రాకేశ్ అస్తానా నియామకాన్ని నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఢిల్లీ సర్కార్ కోరింది. రాకేశ్ అస్తానా, గుజరాత్ కేడర్కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సరిహద్దు సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్గా పదవీ విరమణ చేయడానికి మూడు రోజుల ముందు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో మంగళవారం ఆ బాధ్యతలను రాకేశ్ అస్తానా స్వీకరించారు.
మరోవైపు ఢిల్లీలోని అధికార ఆప్ ప్రభుత్వం ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రాకేశ్ అస్తానా నియామకాన్ని వ్యతిరేకించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులను ఈ పోస్ట్లో నియమించరాదన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధంగా ఉన్నదని ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఢిల్లీ అసెంబ్లీలో అన్నారు. రాకేశ్ అస్తానా నియామకం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఆమోదించింది.
ఇవాళ కోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ప్రకాశ్ సింగ్ జడ్జిమెంట్ కేవలం రాష్ట్రాల్లో డీజీపీలకు మాత్రమే వర్తిస్తుందని, ఢిల్లీ పోలీసు కమిషనర్కు కాదన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అస్తానాను నియమించామని, ఆయనకు కావాల్సిన అనుభవం ఉందని తుషార్ వెల్లడించారు.