న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరిందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన డాటాలో తప్పిదం దొర్లిందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తన డాటాలో పేర్కొన్నట్లుగా ఢిల్లీలో నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 57 కాదని, 54 మాత్రమేనని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ క్లారిటీ ఇచ్చారు. ఆ 54 మందిలో కూడా ఇప్పటికే 18 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని జైన్ వెల్లడించారు.
మంగళవారం కూడా కేంద్రం ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులకు సంబంధించి తప్పుడు డాటాను వెల్లడించిందని జైన్ తెలిపారు. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 52 అయితే కేంద్రం 54గా పేర్కొన్నదని చెప్పారు. ఘజియాబాద్లో నమోదైన రెండు కొత్త కేసులను ఢిల్లీలో కలిపి చెప్పిందని వివరించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఏ ఒక్కరి పరిస్థితి కూడా విషమంగా లేదని, అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని సత్యేందర్ జైన్ తెలిపారు.