న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి గౌహతికి బయలుదేరిన గో ఫస్ట్ విమానం గాలిలో ఉండగా విండ్ షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో ఆ విమానాన్ని జైపూర్కు మళ్లించి సేఫ్గా ల్యాండ్ చేశారు. అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. గో ఫస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన G8151 విమానం ఢిల్లీ నుంచి గౌహతి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం టేకాఫ్ అయ్యింది. మధ్యాహ్నం 2.55 గంటలకు గౌహతి ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సి ఉంది.
కాగా, ఆ విమానం గాలిలో ఉండగా దాని విండ్ షీల్డ్ పగుళ్లిచ్చింది. అయితే ఆ విమానం ఢిల్లీకి తిరిగి రాలేదు. దీనికి బదులుగా జాగ్రత్త చర్యల్లో భాగంగా జైపూర్ విమానాశ్రయానికి దానిని మళ్లించారు. మరోవైపు ఇంజిన్లలో సాంకేతిక సమస్యల కారణంగా మంగళవారం రెండు గో ఫస్ట్ విమానాలు నిలిచిపోయాయి. G8-386 ముంబై-లేహ్ విమానాన్ని ఢిల్లీకి, G8-6202 శ్రీనగర్-ఢిల్లీ విమానాన్ని శ్రీనగర్కు దారి మళ్లించారు. తమ అనుమతి లేకుండా ఆ విమానాలను నడపవద్దని డీజీసీఏ ఆదేశించింది. దీంతో ఆ రెండు విమానాలను నిలిపివేశారు.