న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో పాటు కొవిడ్ బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటోంది. హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులు.. కరోనా నుంచి త్వరగా కోలుకునే అంశాలపై దృష్టి సారించింది.
జనవరి 12వ తేదీ నుంచి హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా బాధితులకు ఆన్లైన్లో యోగా క్లాసులను ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా మంగళవారం ప్రకటించారు. ప్రతి కొవిడ్ బాధితుడు తన పేరును యోగా క్లాసుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. బుధవారం నుంచి ఉదయం, సాయంత్రం గంట చొప్పున యోగా నిపుణులు.. ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అయితే 15 మందికి కలిపి ఒక క్లాస్ నిర్వహిస్తారు. కరోనా బాధితులు యోగా నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. యోగా చేయడం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చని కేజ్రీవాల్ తెలిపారు. ఈ యోగా తరగతులు హోం ఐసోలేషన్లో ఉన్న 40 వేల మందికి ఉపయోగపడనున్నాయి.
ఢిల్లీలో మరో ఒకటి లేదా రెండు రోజుల్లో కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. నిన్న ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 19 వేల కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఆ రాష్ట్రంలో 22 వేలు నమోదు అయిన విషయం తెలిసిందే.