న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణాలు, కూల్చివేతలపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ విషయాన్ని పర్యావరణ మంత్రి గోపాల్రాయ్ సోమవారం ప్రకటించారు. అయితే, దుమ్ము నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నోటీసు లేకుండా పనులు నిలిపివేయడంతో పాటు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
అయితే, పాఠశాలల పునః ప్రారంభం, ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేయడం, దేశ రాజధానిలోకి ట్రక్కుల ప్రవేశంపై ఉన్న నిషేధంపై స్పందించిన ఆయన.. 24న నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎన్జీతో నడిచే వెయ్యి ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకున్నామని, వాటిపై ‘పర్యావరణ్ బస్ సేవ’ రాసి ఉంటుందని మంత్రి తెలిపారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగుల వర్క్ఫ్రం హోం, టక్కులపై నిషేధాన్ని ఈ నెల 26 వరకు పొడగించింది.
గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో దుమ్ము, ధూళి కాలుష్యాన్ని అరికట్టేందుకు నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధాన్ని విధించింది. ఆకస్మికంగా పూర్తి నిషేధాన్ని విధించడం కారణంగా ఆదాయాన్ని కోల్పోతున్న రోజువారీ కార్మికులు ఎక్స్గ్రేషియా, సబ్సిడీ పథకాలు కోరుతూ నిర్మాణరంగ కార్మికుల సంఘ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా.. దేశ రాజధానిలో కాలుష్యం కాస్త తగ్గింది. గాలి నాణ్యత సూచీ 307కు పడిపోయింది. గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్, నోయిడాల్లో ఏక్యూఐ 318, 213, 326, 268గా రికార్డయ్యింది.