న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 16లోపు టీకా వేసుకోని వారిని ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించబోమని హెచ్చరించింది. వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకునే వరకు సెలవులో ఉన్నట్లుగా పరిగణిస్తామని తెలిపింది. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘అక్టోబరు 15 లోపు వ్యాక్సిన్ తీసుకోని (కనీసం మొదటి డోస్) ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్ 16 నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ పొందే వరకు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విద్యాసంస్థలకు హాజరుకావడానికి అనుమతించబోం. సంబంధిత విభాగాల అధిపతులు ఆరోగ్య సేతు యాప్ లేదా టీకా సర్టిఫికెట్ ద్వారా టీకాలు తీసుకున్న ఉద్యోగులను ధృవీకరిస్తారు’ అని అందులో పేర్కొంది.
ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి ఆదేశాలు జారీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణించవచ్చని అందులో సూచించారు.