న్యూఢిల్లీ : దేశ రాజధానిలో స్వచ్ఛ రవాణా విధానం వైపు మళ్లింపును వేగవంతం చేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం విస్తృత ప్రోత్సాహకాల ప్యాకేజీ ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ సంధు దీన్ని ఆమోదిస్తే జూలై 1 నుంచి దీన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సోమవారం తెలిపారు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ విధానంలో విద్యుత్తు కార్లకు పన్ను రాయితీ, కొనుగోలు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
విద్యుత్తు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి మొదటి మూడేండ్లు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు రాయితీగా ఇవ్వనున్నారు. విద్యుత్తు త్రిచక్ర వాహనాలు కొనేవారికి ఇదే విధంగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. 2027 జనవరి 1 నుంచి కేవలం విద్యుత్తు ఆటో రిక్షాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. కొత్త పెట్రోల్, సీఎన్జీ ఆధారిత ద్వి చక్ర వాహనాలకు 2028 ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేయరు.