Delhi Flood | దేశ రాజధాని వరద గుప్పిట చిక్కుకున్నది. హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాల నేపథ్యంలో యమునా నదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీలో యమున ప్రమాదకస్థాయిని మించి ప్రవహిస్తున్నది. హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్నది. యమునా నీటిమట్టం 208.46 మీటర్లకు చేరడంతో ఢిల్లీలోని ఐటీఓలోకి వరద నీరు చేరింది. దాంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరే దర్శనమిస్తున్నది. రాజ్ఘాట్ నుంచి కశ్మీర్ గేట్ వరకు వెళ్లే రహదారి జలమయమైంది.
ఈ రోడ్డు ఎర్రకోట వెనుక నుంచి వెళ్తుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు తమ వస్తువులను సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఢిల్లీలోని పలు రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. ట్రాఫిక్ పోలీసులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీరీ గేట్ మెయిన్ రోడ్, భైరో మార్గ్, ఐపీ ఫ్లైఓవర్, చంద్గి రామ్ అఖారా మధ్య మహాత్మా గాంధీ మార్గ్ – కాళీఘాట్ టెంపుల్, ఢిల్లీ సెక్రటేరియట్ మధ్య రోడ్డును మూసివేశారు. మహాత్మా గాంధీ మార్గ్ – వజీరాబాద్ బ్రిడ్జి, చంద్గి రామ్ అఖారా మధ్య ఔటర్ రింగ్ రోడ్డు మూతపడ్డాయి.
మరో వైపు యమునపై మెట్రో రైలు స్పీడ్ను తగ్గించారు. ముందు జాగ్రత్త చర్యగా నదిపై వంతెనల నుంచి వెళ్లే రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుస్తున్నాయని డీఎంఆర్సీ తెలిపింది. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో సింగు, బదర్పూర్, లోని, చిల్లా సరిహద్దుల నుంచి వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. హర్యానా, హిమాచల్, చండీగఢ్, జమ్మూ-కశ్మీర్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చే బస్సులను సింగు సరిహద్దు వరకు మాత్రమే పరిమితం చేశారు. నిత్యావసరాలకు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాహనాలకు మాత్రం అనుమతి ఇచ్చారు.
ఐఎస్బీటీ నుంచి వచ్చే, వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. యమునా నదిలో వరద నీరు ఢిల్లీకి మాత్రమే కాకుండా నోయిడా, గ్రేటర్ నోయిడాలోకి ప్రవేశించింది. నోయిడాలోని మంగ్రాలీ గ్రామంలోకి నీరు చేరింది. యమున ఉధృతి నేపథ్యంలో యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్లో రాకపోకలను తాత్కాలికంగా మూసివేశారు. అయినప్పటికీ, ఇంటర్చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని, బ్లూ లైన్లో సేవలు సాధారణంగా నడుస్తున్నాయని డీఎంఆర్సీ ట్వీట్ చేసింది.