Arvind Kejriwal : మద్యం పాలసీ (Liquor Policy) కి సంబంధించిన సీబీఐ (CBI) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ ఆయనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను మరింత విచారించాల్సిన అవసరం ఉన్నందున కస్టడీని మరో రెండు వారాలు పొడిగించాలని కోర్టును సీబీఐ కోరింది. దాంతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి అర్వింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సీబీఐ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది.
దాంతో కోర్టు ముందుగా మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది. జూన్ 29 నాటికి మూడు రోజుల సీబీఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపర్చారు. కేజ్రీవాల్ను మరో రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు జూలై 12 వరకు కేజ్రీ రిమాండ్ను పొడిగించింది. ఇవాళ్టితో అది కూడా ముగియడంతో సీబీఐ అభ్యర్థన మేరకు జూలై 25 వరకు కస్టడీ విధించింది.
కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేజ్రీవాల్ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను అదే కేసులో జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. కేసుకు సంబంధించి గత రెండు వారాలుగా ఆయన నుంచి పలు వివరాలు రాబడుతోంది.