Kolkata | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘనటకు నిరసనగా జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. గత శనివారం నుంచి వైద్యులు దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో వైద్యులు (Delhi doctors) దీక్ష చేపడుతున్నారు.
ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి చెందిన వైద్యులు బుధవారం ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేపడుతున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ క్యాండిల్ మార్చ్ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జవహర్ లాల్ నేహ్రూ స్టేడియంలో ఈ మార్చ్ ఉంటుందని పేర్కొంది.
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఆర్డీఏ ప్రెసిడెంట్ అపర్ణా సెటియా మాట్లాడుతూ.. ‘బెంగాల్లో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యులకు మా మద్దతు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరాహార దీక్షలు చేపట్టాం. దీక్ష సమయంలో ఆహారం, మంచి నీటికి దూరంగా ఉంటాం’ అని తెలిపారు. మరోవైపు వైద్యుల ఆందోళనకు మద్దతుగా ఎమ్ఏఎమ్సీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్.. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడింది. జూనియర్ డాక్టర్లకు సంఘీభావంగా వైద్యుల న్యాయం, భద్రత, గౌరవం కోసం ముందుండి పోరాడతామని స్పష్టం చేసింది.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, దవాఖానలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై లైంగికదాడి, హత్య ఘటన పశ్చిమ బెంగాల్ను తీవ్రంగా కుదిపేసింది. ఆగస్టు 9న వెలుగుచూసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు దాదాపు నెల రోజులు విధులు బహిష్కరించి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇవ్వడంతో ఇటీవల ఆందోళనను విరమించి విధుల్లో చేరారు.
అయితే, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం మరోసారి సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి 24 గంటల నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం స్పందించకపోవడంతోనే నిరాహార దీక్ష చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యుల ఫ్రంట్ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా ఆర్జీ కార్ ఆసుపత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు మంగళవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
సీబీఐ చార్జిషీట్
మరోవైపు డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ను దాఖలు చేసింది. 200మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్గా తేల్చింది. రాత్రి విరామ సమయంలో దవాఖాన సెమినార్ హాల్లోకి వెళ్లిన వైద్యురాలిపై సివిక్ వలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఘాతుకానికి పాల్పడ్డాడని సీబీఐ తెలిపింది. గ్యాంగ్ రేప్ జరిగిందా? లేదా? మరికొంత మంది ప్రమేయం ఇందులో ఉందా? అన్నది తేల్చేందుకు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొన్నది.
Also Read..
Rahul Gandhi | హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నాం : రాహుల్ గాంధీ
Army jawans | ఇద్దరు జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి