ఢిల్లీ, ఫిబ్రవరి 28( నమస్తే తెలంగాణ): ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తమ పదవులకు మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. మద్యం కేసులో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేయడానికి ముందే తనను ఏడెనిమిది నెలల పాటు జైలులో ఉంచే అవకాశం ఉన్నదని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. సత్యేంద్ర జైన్ కూడా మనీలాండరింగ్ కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్నారు. వీరిద్దరి స్థానంలో కేజ్రీవాల్ కొత్తగా ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదని, పోర్టుఫోలియోలను ఇతర మంత్రులకు అప్పగించనున్నారని తెలుస్తున్నది.
ఆమ్ ఆద్మీ పార్టీలో, ఢిల్లీ ప్రభుత్వంలో మనీశ్ సిసోడియా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్ తర్వాత నెంబర్ 2గా ఉన్నారు. సత్యేంద్ర జైన్ అరెస్టయిన తర్వాత ఆయన పోర్టుఫోలియాలను కూడా సిసోడియా చూస్తున్నారు. 18 పోర్టుఫోలియోలకు మంత్రిగా ఉన్నారు. ఢిల్లీ సర్కారుకు పేరు తెచ్చిన విద్యా సంస్కరణలు, పాఠశాలల ఆధునికీకరణ, మొహల్లా క్లినిక్ల ఏర్పాటులో సిసోడియా కీలకంగా వ్యవహరించారు. మార్చి మూడో వారంలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నది. సీఎం కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీ క్యాబినెట్లో ఏడుగురు మంత్రులు ఉన్నారు. సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామాతో సంఖ్య ఐదుకు తగ్గింది.
బెయిల్ కోరుతూ మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. మంగళవారం ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ధర్మాసనం ప్రశ్నించగా, వినోద్ దువా కేసును అభిషేక్ సింఘ్వీ ప్రస్తావించారు. అయితే, ఇది అవినీతికి సంబంధించిన కేసు అని, హైకోర్టుకే వెళ్లాలని తెలిపింది. దీంతో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తామని మనీశ్ సిసోడియా తెలిపారు. మద్యం కేసులో సీబీఐ చార్జ్షీట్లో మనీశ్ సిసోడియా పేరు లేనందున ఈ అరెస్టు అక్రమమని ఆయన పేర్కొన్నారు. విచారణకు సహకరించడం లేదని సీబీఐ చెప్తున్న కారణం బలహీనమైనదని స్పష్టం చేశారు.