Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Delhi Deputy Chief Minister) మనీష్ సిసోడియా (Manish Sisodia)ను ఢిల్లీ కోర్టు సీబీఐ (CBI) కస్టడీకి ఇచ్చింది. ఆయన మార్చి 4 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case)లో సిసోడియాను విచారించిన సీబీఐ.. ఎనిమిది గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఉప ముఖ్యమంత్రిని సీబీఐ హాజరుపరిచింది. ఆ తర్వాత సిసోడియాను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఎందుకు సిసోడియా రిమాండ్ అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సిసోడియాను ఇంకా విచారించి, వివరాలు రాబాట్టాల్సి ఉందని తెలిపారు.
సిసోడియా ఒకేసారి పలు మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను మార్చి.. నిందితులతో మాట్లాడిన సాక్షాలను మాయం చేశారని సీబీఐ తరఫు న్యాయవాది విచారించారు. మద్యం పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. లిక్కర్ పాలసీలో కమిషన్ను 5 నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని ఆరోపించారు. కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం జడ్జి ముందుంచారు. మరోవైపు సిసోడియా విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు ఆరోపణలతో రిమాండ్కు కోరుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్కు అంగీకరించొద్దని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వ్లో ఉంచిన కోర్టు.. ఆ తర్వాత మార్చి 4వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
మరో వైపు, సిసోడియా అరెస్టును నిరసిస్తూ ఆప్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) మార్గ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారు. పలువురు ఆప్ మద్దతుదారులను పారామిలటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో అరెస్టు చేశారని మండిపడ్డారు. చాలా మంది సీబీఐ అ ధికారులు మనీశ్ అరెస్టును వ్యతిరేకించారని పలువురు అధికారులు తనకు చెప్పారన్నారు. అధికారులందరికీ సిసోడియాపై అపారమైన గౌరవం ఉందన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, అయితే ఆయనను అరెస్టు చేయాలని రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అధికారులు రాజకీయ గురువులకు విధేయత చూపాల్సి వచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) స్పందించారు. బీజేపీ అవలంభిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలన ఉపయోగించుకుంటున్నారన్న దానికి ఇదో ఉదాహరణ అని, దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇది కఠోరమైన అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. ఇలాంటి అణచివేత మన దేశం పునాదిని దెబ్బతీస్తుంది, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) స్పందిస్తూ వారు (బీజేపీ) ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని నడుపాలని కోరుకోవడం లేదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడి భార్య భారతదేశానికి వచ్చి ఢిల్లీ ప్రభుత్వం నిర్మించిన పాఠశాలలు నిర్మించిన చూడాలని కోరుకున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన సమస్య ఢిల్లీ ప్రభుత్వ ప్రజాదారణ అని ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. దేశం మొత్తం లక్షల కోట్లు కొల్లగొట్టిన మోదీ మిత్రుడు అదానీ వైపు చూస్తోందన్నారు. అయినా సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్సీబీ, సెబీ మౌనంగా ఉన్నాయని విమర్శించారు. మనీష్ సిసోడియా ఢిల్లీలో లక్షలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్ను నిర్మించారన్నారు. బీజేపీకి భయపడేది లేదన్నారు.