న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వణికిస్తున్నది. రికార్డుస్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్ 20 వరకు మొత్తం 7,128 కేసులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఒక్క నవంబర్ నెలలోనే గత వారం వరకు రికార్డుస్థాయిలో 5,600 డెంగ్యూ కేసులు నమోదు కావడం అధికారులను కలవరపరుస్తున్నది.
కాగా, ఢిల్లీలో 2016లో 4,431, 2017లో 4,726, 2018లో 2,798, 2019లో 2,036, 2020లో 1,072 డెంగ్యూ కేసులు నమోదైనట్లు నివేదిక ద్వారా తెలుస్తున్నది. అయితే 2015లో డెంగ్యూ బారిన పడిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ ఏడాది అక్టోబర్లో కేసుల సంఖ్య 10,600 దాటింది. 1996 తర్వాత అదే అత్యంత ఘోరమైన డెంగ్యూ వ్యాప్తి.