Chhath Puja | ఈ నెల 10వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 10న ఛాత్ పూజ జరుగనున్నది. ఈ నేపథ్యంలో యమునా నది తీరాన మినహా సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గతవారం ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ క్యాపిటల్ టెరిటోరీ (ఎన్సీటీ) ప్రాంత ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ ఛాత్ పూజ. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.
దీపావళి పర్వదినం తర్వాత బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఛాత్ పూజ నిర్వహిస్తారు. ఈ రెండు రాష్ట్రాల మహిళలు మోకాళ్ల లోతునీళ్లలో నిలబడి సూర్య భగవానుడికి అర్ఘ్య ప్రదానం చేస్తారు. ఈ పర్వదినం సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలో ఉంటారు.