న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ( Tejashwi Yadav) జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈడీ సమన్ల నేపథ్యంలో ఢిల్లీ కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాలూ కుటుంబానికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ లాలూ, తేజస్వి యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 27న లాలూ, జనవరి 5న తేజస్వి తమ కార్యాలయానికి రావాలంటూ నోటీసులు పంపింది.
కాగా, తేజస్వి యాదవ్ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. జనవరి 6 నుంచి 18 వరకు ప్రభుత్వ అధికారులు, ఇంజినీర్లతో కూడిన బృందంతో కలిసి ఆస్టేలియా, న్యూజిలాండ్లో అధికార పర్యటన ఉందని తెలిపారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, బీహార్ ప్రభుత్వం నిధులతో ఆరు లైన్ల గంగా వంతెన ప్రాజెక్ట్లో భాగంగా రోడ్లు, వంతెనల నిర్మాణానికి ఈ టూర్ ఉద్దేశమని న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. దీంతో ఆ పర్యటనకు కోర్టు అనుమతించింది. రూ. 25 లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే తేజస్వి పాస్పోర్ట్ను ఏడాదికి రెన్యూవల్ చేసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది.