న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోగా ఢిల్లీ పోలీసులు కేసుకు సంబంధించిన అదనపు డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతి ఇచ్చింది. సునంద పుష్కర్ 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె విషం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.
దాంతో పోలీసులు అది ఆత్మహత్యగా పేర్కొంటూ కేసు నమోదు చేయగా, సునంద పుష్కర్ కుటుంబసభ్యులు మాత్రం ఆమెను ఆమె భర్త శశిథరూరే విషమిచ్చి చంపేశాడని ఆరోపించారు. ఈ కేసుపై గత ఏడేండ్లుగా ఢిల్లీ కోర్టులో పలు దఫాల్లో విచారణ జరిగింది. ఇవాళ తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఢిల్లీ పోలీసులు కేసుకు సంబంధించి మరికొన్ని అదనపు డాక్యుమెంట్లను సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు అందుకు అనుమతి ఇస్తూ తీర్పును ఆగస్టు 18వ తేదీకి వాయిదా వేసింది.