న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి శశిథరూర్పై ఘన విజయం సాధించిన మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 26న పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ రణ్దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17న పోలింగ్ జరిగింది.
ఇవాళ ఢిల్లీలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 9,385 ఓట్లు పోలవగా అందులో 7,897 ఓట్లు ఖర్గేకు పడ్డాయి. శశిథరూర్కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే.. తమ పార్టీలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలేమీ ఉండవన్నారు. అందరం కలిసికట్టుగా కార్యకర్తల్లా పనిచేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేస్తున్న ఫాసిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా తామంతా కలిసికట్టుగా పోరాడుతామని ఆయన చెప్పారు.