న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తున్నది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతోపాటు చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. దీంతో పర్వత ప్రాంతాలైన ధర్మశాల, నైనిటాల్లో కన్నా ఢిల్లీలోనే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ధర్మశాలలో 6.2 డిగ్రీలు, నైనిటాల్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా, హస్తినలో 6 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 5.6 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు సూర్యరశ్మిని కప్పి ఉంచటంతోపాటు వాయువ్య మైదానాల గుండా వీస్తున్న చల్లని గాలులతో పగటిపూత ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని చెప్పారు.
కాగా, దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో న్యూఢిల్లీకి రావాల్సిన 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, మరో రెండు విమానాలను దారి మళ్లించామని ఇందిరాగాంధీ విమానాశ్రయం ప్రకటించింది. స్పైస్ జెట్, ఇండిగో విమానాలను జైపూర్ మళ్లించామని, సుమారు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.