న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ‘ఢిల్లీ కీ యోగశాల’ ( Dilli Ki Yogshala ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద అవసరమైన ఢిల్లీ వాసులు ఒక ఫోన్ చేస్తే చాలు ఉచితంగా యోగా టీచర్ను సమకూర్చనున్నారు. ఈ ఉచిత యోగా సేవల కోసం ఢిల్లీ సర్కారు 9013585858 మొబైల్ నంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచింది.
అయితే, వ్యక్తులు విడివిడిగా ఈ యోగా టీచర్ సేవలను పొందడానికి అవకాశం లేదు. ఢిల్లీకి యోగశాల కార్యక్రమం ద్వారా ఉచిత యోగా సేవలు పొందాలంటే స్థానికంగా కనీసం 25 మంది ఒక గ్రూప్గా ఏర్పడాల్సి ఉంటుంది. 25 లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక గ్రూప్గా ఏర్పాటయ్యి పైన పేర్కొన్న మొబైల్ నంబర్కు ఫోన్ చేస్తే.. ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా యోగా టీచర్ను సమకూర్చనుంది. ఈ కార్యక్రమం 2022 జనవరిలో ప్రారంభమవుతుందని సీఎం అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు.