Arvind Kejriwal | యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయడానికి కమిటీని ఏర్పాటుకు చేసేందుకు గుజరాత్ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దీని వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయాలనుకుంటే.. బీజేపీ దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని.. ఈ దిశగా అడుగులు వేసేందుకు లోక్సభ ఎన్నికల కోసం వేచి చూస్తోందా? అని ప్రశ్నించారు.
భావ్నగర్లో ఆదివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. బీజేపీ ఉద్దేశం సరైంది కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్ను రూపొందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా ఉందన్నారు. కాబట్టి ప్రభుత్వం అన్ని వర్గాల సమ్మతితో.. వారిని కలిసి ఒక యూనిఫాం సివిల్ కోడ్ను రూపొందించాలి అన్నారు. ఇంతకు ముందు ఉత్తరాఖండ్ ఎన్నికలకు ముందు బీజేపీ ఇలాంటి కమిటీనే ఏర్పాటు చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేసింది.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమిటీ ఇంటికి వెళ్లిందని, తాజాగా గుజరాత్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మరో కమిటీ ఏర్పాటు చేశారని, ఈ కమిటీ సభ్యులు సైతం ఎన్నికల తర్వాత వారి ఇండ్లకు తిరిగి వెళ్తారన్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి కమిటీలను ఎందుకు వేయలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయడమే వారి ఉద్దేశమైతే, దాన్ని జాతీయస్థాయిలో ఎందుకు రూపొందించరు? దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు? అని నిలదీశారు.