న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఈ నెల 28 నుంచి పంజాబ్లో పర్యటించనున్నారు. 28, 29, 30 తేదీల్లో కేజ్రివాల్ పంజాబ్ పర్యటన కొనసాగనుంది. ఆ మూడు రోజులు పంజాబ్లోని వివిధ నియోజకవర్గాలను కేజ్రివాల్ చుట్టిరానున్నారు. జలంధర్, అమృత్సర్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పట్టున్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కేజ్రివాల్ పర్యటిస్తారు.
ఆయా నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా బహిరంగ ప్రచారంపై నిషేధం కొనసాగుతుండటంతో.. పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశాల్లో కార్యకర్తలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలున్నాయి. 2017 ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనుంది. మార్చి 7న ఫలితాలు వెల్లడికానున్నాయి.