న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మూడు కేజీల భారీ సమోసాను 5 నిమిషాల్లో తిన్నాడు. రూ.11,000 గెలుచుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రజనీష్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యు హంగ్రీ’ పేరుతో ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ని నిర్వహిస్తున్నాడు. అంతేగాక అతడు పలు ఫుడ్ ఛాలెంజ్లు స్వీకరిస్తాడు. ఫుడ్ ఛాలెంజ్ల ద్వారా డబ్బులు కూడా గెలుచుకోవచ్చని చెప్పడంతోపాటు స్వయంగా ఆయా పోటీల్లో పాల్గొంటాడు.
ఇందులో భాగంగా ఇటీవల ఒక స్ట్రీట్ ఫుడ్ సవాల్లో రజనీష్ పాల్గొన్నాడు. మూడు కేజీల భారీ సమోసాను కేవలం ఐదు నిమిషాల్లో తిన్నాడు. ఆ ఈటరీ యజమాని నుంచి రూ.11,000 కూడా గెలుచుకున్నాడు. ఈ డబ్బును ఇతర వీడియోల కోసం ఖర్చు చేస్తానని తెలిపాడు. అయితే ఇలాంటి ఫుడ్ పోటీల్లో పాల్గొనే ముందు అతడు 1-2 రోజుల పాటు ఏమీ తినడు. కాగా, ‘ఆర్ యు హంగ్రీ’ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే లక్ష మందికిపైగా దీనిని వీక్షించారు.