న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఏలుతున్న బీజేపీకి ఈసారి భంగపాటు ఎదురైంది. దీంతో ఎంసీడీ ఎన్నికల్లో ఓటమికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా నైతిక బాధ్యత వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వచ్చిన సూచనల మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానాన్ని వీరేంద్ర సచ్దేవా భర్తీ చేస్తారని వెల్లడించాయి.
కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) పరిధిలోని మొత్తం 250 వార్డులకు గత ఆదివారం ఎన్నికలు జరిగాయి. బుధవారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 104 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలుపొందాయి. 3 సీట్లను స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు.