Farmers Protest | రెండోసారి ప్రారంభమైన రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రజల్లో మరోసారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళన కష్టాలను ఇంకా మరవనే లేదు… మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి ఢిల్లీ సామాన్యులకు. ప్రతి రోజు 5 గంటలపాటు ట్రాఫిక్లో ఇబ్బందులు పడాల్సి వస్తోందని సామాన్యులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేం చేసిన తప్పేంటి, ఏ ఆందోళన మొదలైనా మాకు మాత్రం కష్టాలు తప్పటం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మేం చేసిన తప్పల్లా రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలోల బతుకునీడుస్తుండటమే అని వారు తమను తాము నిందించుకుంటున్నారు.
రెండో సారి రైతు ఆందోళన ప్రారంభమై ఆరో రోజుకు చేరుకుంది. మరికొన్ని రోజులు నిరసన కొనసాగితే నిత్యావసర వస్తువుల కొరత కూడా ఉత్పన్నమవుతుందని, ధరలు పెరగటం తప్పదని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. తరచూ రాజధాని ఢిల్లీలో జరిగే నిరసన ప్రదర్శనల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఢిల్లీ ప్రజలను రక్షించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయో, దానికి బాధ్యులెవరో ? ఎవరూ జవాబు చెప్పటంలేదని సామాన్యుడు మాత్రం తన బాధలను దిగమింగుకుని బతుకు భారంగా ఈడుస్తున్నాడు. దేశ రాజధానిలో నివసిస్తున్న సామాన్యులు ఈ కష్టాల గురించి ప్రభుత్వం కానీ,ప్రతిపక్షం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని, దీనిపై టీవీల్లో చర్చ జరగాలని వారు కోరుకుంటున్నారు. రైతుల నిరసనలు మొదటిసారి కాదు.
ఇంతకు ముందు కూడా, రైతులు చాలా రోజులు ఢిల్లీ సరిహద్దుల వెలుపల కూర్చోవడమే కాకుండా, దేశ వ్యతిరేక శక్తులు కూడా వారికి తోడై ఢిల్లీ లోపలికి వచ్చి ఎర్రకోట పరిసర ప్రాంతాలలో విధ్వంసం సృష్టించారు.
గతంలో రైతుల ప్రదర్శనల వల్ల ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులను, ఆనాటి చేదు అనుభవాలను ఢిల్లీ ప్రజలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. దేశ రాజధాని కావడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ ప్రవేశ మార్గాలన్నీ మూసివేయడం, ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలోనే వందలాది మందిని నిలువరించడం వల్ల ఆయా ప్రాంతంలోని ప్రజలకు వివిధ రకాల సమస్యలు కలగడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ, ఎన్.సీ.ఆర్. మధ్య ప్రతిరోజూ తమ కార్యాలయాలకు వెళ్లే వ్యక్తులు, ఇతర చిన్నా చితక ప్రయివేటు పనులు చేసుకుని బతుకుతున్న బడుగుల రాకపోకల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు, గంటల పాటు ట్రాఫిక్ జామ్లను ఎదుర్కోవలసి వస్తోంది. అటువంటి పరిస్థితిలో, ప్రయాణ సమయం రెండు నుంచి మూడు గంటలు పెరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాటిలో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయి. అంతే కాదు పాలు, కూరగాయల ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను రోజూ మార్కెట్కు తీసుకువెళ్లడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత కారణంగా, ధరలు పెరుగుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావంతో పాటు, ఇటువంటి నిరసనలు స్థానిక ప్రజలలో సామాజిక గందరగోళాన్ని, మానసిక ఒత్తిడి పెంచుతోంది. రోజువారీ జీవితంలో అల్లకల్లోలం ఆందోళన పెరుగుతోంది. మానసిక, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఇటువంటి నిరసనల ప్రభావం ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలపై పడుతుంది. ఉపాధి కోల్పోవడం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా వారు రెట్టింపు ప్రభావం చూపుతోంది..
నిరసన చేయడం ప్రజాస్వామ్య హక్కే..కానీ.. దేశంలోని ప్రతి పౌరుడికి తన అభిప్రాయాలను వెల్లడించడానికి రాజ్యాంగ ప్రాథమిక హక్కులు ఉన్నా, సమస్యను ప్రభుత్వానికి తెలియజేసే హక్కున్నా… అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని, పలువురు సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.