న్యూఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగిన ఈ సమావేశానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలందరూ హాజరయ్యారు. మొత్తం 31 పార్టీలకు చెందిన 42 మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల రీత్యా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఈ సమావేశానికి రాలేదు.
కాగా, అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ఆల్పార్టీ మీట్లో మొత్తం 31 పార్టీలు పాల్గొన్నాయని ఆయన చెప్పారు. ఆయా పార్టీల నుంచి మొత్తం 42 మంది నేతలు హాజరై నిర్మాణాత్మక చర్చలు జరిపారని తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్ అనుమతించిన ఏ అంశంపైన అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని జోషి చెప్పారు. అయితే, సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
ఈ అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం తరఫు నుంచి కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయెల్, అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు. వివిధ పార్టీల నుంచి మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధరి, ఆనంద్ శర్మ, సతీష్ చంద్ర మిశ్రా, సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఓ’బ్రియన్, నామా నాగేశ్వర్ రావు, రాంగోపాల్ యాదవ్, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, పశుపతి పరాస్, అనుప్రియా పటేల్, సంజయ్ సింగ్, రామ్దాస్ అథవాలే, తిరుచ్చి శివ, విజయ సాయి రెడ్డి, ఫరూక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.