న్యూఢిల్లీ, డిసెంబర్ 17: భారత భద్రతా బలగాలు తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకొంటున్నాయి. సరిహద్దుల్లో అటు పాకిస్థాన్, ఇటు చైనాతో నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఆయుధ శక్తిని పెంచే పనిలో పడ్డాయి. సరికొత్త ఆవిష్కరణల్లో భాగంగా పలు ఆయుధ వ్యవస్థలు భారత ఆర్మీ, వాయు, నేవీ దళాల్లో చేరుతున్నాయి. తాజాగా ‘ఆకాశ్’ మిస్సైల్ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం ద్వారా దేశ ఆయుధ వ్యవస్థ శక్తిని భారత్ మరోసారి ప్రపంచానికి చాటింది. ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంలో చేధించడం ఈ క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత. దేశీయంగా అభివృద్ధి చేసిన అకాశ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఇటీవల సూర్యలంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లోజరిగిన అస్త్రశక్తి-2023 విన్యాసాల సందర్భంగా ప్రదర్శించారు. ఒకే ఫైరింగ్తో నాలుగు లక్ష్యాలపై గురిపెట్టగల క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ప్రపంచంలోని మొదటి దేశంగా భారత్ నిలిచింది.
నాలుగు లక్ష్యాలను ఎలా చేధిస్తుంది?
ఆకాశ్ అనేది ఉపరితలం నుంచి ఆకాశంపైకి ప్రయోగించగల క్షిపణి వ్యవస్థ. దీన్ని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఆకాశ్ ఫైరింగ్ యూనిట్.. ఫైరింగ్ లెవల్ రాడార్(ఎఫ్ఎల్ఆర్), ఫైరింగ్ కంట్రోల్ సెంటర్(ఎఫ్సీసీ), ఐదు సాయుధ క్షిపణులు కలిగి ఉన్న రెండు ఆకాశ్ ఎయిర్ ఫోర్స్ లాంచర్ల (ఏఏఎఫ్ఎల్)తో మోహరించబడి ఉంటుంది. ఆకాశ్ లాంచర్ల నుంచి మొత్తం నాలుగు క్షిపణులు దూసుకెళ్లి 30 కిలోమీటర్ల పరిధిలోని నాలుగు లక్ష్యాలను చేధించాయి.