ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హరిభేజి అనే 81 ఏండ్ల వృద్ధురాలు గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న హరిభేజి ఈ నెల 3న మెదడులో రక్తం గడ్డకట్టడంతో చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు.
దాంతో కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులందరూ హరిభేజిని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు విచ్చేశారు. ఇక కుటుంబసభ్యులు ఇంటి దగ్గర సంప్రదాయం ప్రకారం జరగాల్సిన క్రతువును పూర్తిచేసి పాడెపై ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు.
శ్మశానవాటికకు చేరిన తర్వాత పాడెపై నుంచి కాష్టంపైకి ఆమె మృతదేహాన్ని మారుస్తుండగా ఒక్కసారిగా కళ్లుతెరిచింది. దాంతో అంత్యక్రియలకు హాజరైన బంధుమిత్రులు షాక్ గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే తేరుకుని వృద్ధురాలిని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు. కానీ మరుసటిరోజే అనారోగ్యంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
దాంతో బుధవారం మరోసారి బంధుమిత్రులకు సమాచారం ఇచ్చి హరిభేజి అంత్యక్రియలు నిర్వహించారు. హరిభేజి కుమారుడు సుగ్రీవ్ సింగ్ ఆమె చితికి నిప్పటించాడు. అనంతరం జరిగిన ఆసక్తికర ఘటన గురించి మీడియా ప్రశ్నించగా సుగ్రీవ్ సింగ్ వివరాలు తెలియజేశాడు.